Health12th Aug 05:11 PMSunil Byrisetty1 min read
డిసెంబరు 1 నాటికి ‘95-95-99’
హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, 2026 డిసెంబరు 1 నాటికి నిర్దేశిత ‘95-95-99’ లక్ష్యాలను వంద శాతం సాధించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సత
హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, 2026 డిసెంబరు 1 నాటికి నిర్దేశిత ‘95-95-99’ లక్ష్యాలను వంద శాతం సాధించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ సాధనలో యువతతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీ శాక్స్) ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన '60 రోజుల ప్రత్యేక సమాచార, విద్య, ప్రచారం పేరుతో తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. హెచ్ఐవీ నియంత్రణలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. గతంతో పోలిస్తే కొత్త హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు 77 శాతం, మరణాలు 87 శాతం తగ్గడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ క్రమంలో అంచనా వేసిన హెచ్ఐవి బాధితుల్లో 95 శాతం మందికి హెచ్ ఐవి వచ్చినట్లు తెలిసి ఉండాలని, తెలిసిన వారిలో 95 శాతం మంది మందులు వాడుతూ ఉండాలని, మందులు వాడే వారిలో 99 శాతం మందికి వైరల్ లోడ్ బాగా తగ్గి ఉండాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. ఈ మూడు కేటగిరీల్లో రాష్ట్ర ప్రభుత్వం 88-87-96.2 శాతం మేర పురోగతిని సాధించిందని చెప్పారు. మిగిలిన లక్ష్యాన్ని(95-95-99) డిసెంబరు 1 గడువులోగా లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని కోరారు.